చాలా చాలా ఆనందం గా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది .. అంతా ఓ కలలా ఉంది . మంచి కి ఓ వైపు మీరుంటే
చెడు వైపు ఆ బ్లడీ వైజయంతి ఉంది .. మీలా ఆమె ఎందుకు ఆలోచిన్చలేకపోతోంది ? ఆవేశం గా అన్నాడు మురారి
ఆమె చిన్నగా నవ్వి .. నా ముందరే నా సోదరిని అవమానించవద్దు మురారి . మీకు తెలియదు పరిస్థితులే మంచి
చెడులను నిర్ణయిస్తాయి . మనసు చెడు సాహవాసాన్ని మరిగినప్పుడు మన దారి చెడు వైపే మళ్ళుతుంది .. అదే
మంచి సహవాసం దొరికి నప్పుడు మన అడుగు మంచి వైపే సాగుతుంది . అంది విధాత్రి
కానీ వైజయంతి ఎందుకిలా మారింది ? ఆమె ఓ దుష్ట శక్తి గా మారటానికి కారణ మేంటి ? రాకుమారి అన్నాడు
యశ్వంత్ .
శివ తన కళ్ళని తానె నమ్మక కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాడు . మురారి ఆమె సమాధానం కొరకు వేచి
ఉన్నాడు .
ఆమె స్వరం ఓ క్షణం వణికి నట్లైంది ..
చెప్తాను .. మా ఆశల సౌధ మైన ఈ సౌధం రుధిర సౌధం గా ఎలా మారిందో ... 2వందల ఏళ్ళక్రితం ఈ ప్రాంతం
మా నాన్నగారైన మహారాజు విక్రాంత వర్మ గారి పాలనలో ఉండేది . నాన్న గారి హాయం లోనే బ్రిటిష్ పాలన లో
ప్రజలు మగ్గుతుండే వారు . మా రాజ్యం లో చాలా ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యం కారణం గా మాకు కాకుండా
పోయాయి .. నాన్న గారికి ఆ సమయం లోనే మహారాణి హేమావతి సంతానానికి నోచుకోక పోవటం బాధించింది .
రాజ్యానికి వారసుడు లేకపోవట మనేది రాచరిక కుటుంబాలలో అతి పెద్ద సమస్య . వారసుడు లేని రాజ్యాలను
బ్రిటిష్ వారు సునాయాసం గా తమ కైవసం చేసుకునేవారు . అందువల్ల రాజ్యాన్ని పరదేశీయుల పరం కానివ్వ
కూడదని తలచిన మా నాన్నగారు వారసుడు కోసం అతి సామాన్య కుటుంబానికి చెందిన మా అమ్మ వసుంధర ని
మనువాడారు . ఈ విషయం పెద్దమ్మ హేమావతికి నచ్చలేదు . అత్యంత సౌందర్య వతి అయిన వసుంధరా దేవి తో
మహారాజు గారు ఎంతో ప్రేమగా ఉండేవారు . ఆమె ని పెళ్ళిచేసుకొన్న తరువాత రాజ్యం లో కొంత సుఖశాంతులు
నెలకొన్నాయని ప్రజలు భావించేవారు . వసుంధరా దేవి మగ బిడ్డని కన్నది . రాజ్యానికి వారసుడు లభించాడు .
పట్టమహిషి పదవి వసుంధర కి దక్కింది . అది హేమావతి కి కంట నలక అయింది . రాజ్యానికి వారసుడిని కానుక
గా ఇచ్చినందులకు వసుంధరా దేవి కి కానుకగా ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలని మహారాజు తలంచారు . ఆ
భవనమే ఈనాటి ఈ రాణి మహల్ . మహారాణి వసుంధర కొరకు నిర్మించిన మహల్ కావటం తో ఈ మహల్ ని
రాణి మహల్ గా పిలిచేవారు . మహల్ పూర్తి కాక ముందే చిత్రం గా హేమావతి గర్భం దాల్చింది .. ఓ ఆడబిడ్డకి
జన్మ నిచ్చింది . వసుంధర ఆగమనం వలెనే హేమావతికి తల్లైన భాగ్యం దక్కిందని అందరూ తలంచారు . ఆ
మాటలు హేమావతిని బాధ కి గురిచేశాయి . వసుంధర రాక తో తన జీవితం లో సుఖశాంతులు పోయాయని
భావించింది ఆమె . పైగా ఆమె కొరకు మహారాజు మహల్ ని నిర్మించటం ఆమె లో ఆసూయ ని తట్టి లేపింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment